అది శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు. సాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉండేవి. ఉన్న రెండు, మూడు చెరువులు పూడికతో నిండి ఉండేవి. ఇక ఊరిలో రహదారులు అస్తవ్యస్థంగా ఉండేవి. ఊరి నిండా ఎటుచూసినా చెత్త దర్శనమిచ్చేది. పల్లెటూరి పిల్లల కోసం ఉద్దేశించిన అంగన్వాడీ కార్యక్రమానికి సరైన భవనం కూడా లేదు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఉపాధి హామీ పథకం గురించి వారికి పూర్తిగా అవగాహన లేని రోజులవి. కానీ నరేగా పథకం ఆ ఊరి స్వరూపాన్నే మార్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. అనేక రంగాల్లో ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. ఉపాధి హామీ పథకాన్నిఎలా ఉపయోగించుకోవాలో ఓ నమూనాగా రాష్ట్రానికి చాటుతోంది.
ఇంతకీ ఆ ఊరి వివరాలు చెప్పలేదు కదూ. అదే చొర్లంగి. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రానికి 45కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎల్ ఎన్ పేట మండలంలో ఉంది. చొర్లంగి గ్రామ జనాభా 1569. ఇప్పుడీ గ్రామం ఉపాధి హామీ పథకాన్ని చక్కగా ఉపయోగించుకుంటోంది. మొదట్లో నరేగా పథకం అంటే ఏంటో అవగాహన లేకపోయినా ఆ తర్వాత చకచకా అడుగులు వేసింది. ఇప్పుడు ఆ గ్రామంలోని 453కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. ఉపాధి హామీ పథకంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడమే కాదు.. ఊరి స్వరూపాన్నే మార్చేసుకున్నారీ పల్లెవాసులు.
చొర్లంగి గ్రామంలో వరి, జీడిమామిడి, రాగులు ప్రధానపంటలు. అంతకుముందు సాగునీటి సౌకర్యాలు పెద్దగాలేవు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామస్తులు పంట సంజీవనులు తవ్వుకున్నారు. వాన నీటిని సంరక్షించుకునేలా కట్టడాలు నిర్మించుకున్నారు. ఊరిలోని చెరువుల్లో పూడికలు తీసుకున్నారు. ఇప్పుడు చొర్లంగి ఎన్టీఆర్ జలసిరులతో కళకళలాడుతోంది.
సాగునీటి సౌకర్యాల మెరుగుపడటంతో ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరిగింది. దీంతో వారు విభిన్నంగా ఆలోచించడం ప్రారంభించారు. సాధారణంగా సాగు చేసే పంటలకు తోడు ఉద్యానవన పంటలు కూడా సాగుచేస్తూ ఆదాయం పెంచుకున్నారు. కొందరైతే టేకు ప్లాంటేషన్ కూడా చేపట్టారు. మరికొందరు వర్మి కంపోస్టు తయారీ చేపట్టి స్థానిక రైతులకు విక్రయించడం ప్రారంభించారు.
కొందరు రైతులు పెరటి తోటలు పెంచుతున్నారు. నాడెప్ కంపోస్టు పిట్లు కూడా తయారు చేస్తున్నారు. ఉపాధి హామీ విజయాల గురించి గ్రామ సర్పంచ్ మహిత సత్యనారాయణగారిని అడిగితే.. చెరువుల్లో పూడిక తీయడం వల్ల దాదాపు 2,120 ఎకరాల్లో దిగుబడి పెరిగిందని గర్వంగా చెబుతారు. అంతే కాదు.. ఇప్పుడు 50 ఎకరాల్లో సేంద్రీయ సాగు చేస్తున్న వైనాన్ని వివరించేటప్పడు ఆయన కళ్లలో ఎక్కడ లేని సంతృప్తి కనిపిస్తుంది. ఇవన్నీ ఉపాధి హామీ పథకం కారణంగా లభించిన రైతు విజయాలు.
చొర్లంగిలో ఉపాధి హామీ పథకం ముందుగా రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. ఆ తర్వాత ఆ గ్రామంలోనూ ప్రగతి వెలుగులు నింపింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి ఎన్టీఆర్ గృహాలు మంజూరయ్యాయి.గ్రామంలో దాదాపు 320 వరకూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. వాననీటిని ఒడిసిపట్టుకోవడం ద్వారా పొలాల్లో ధాన్య సిరులు పండిస్తున్న చొర్లంగి గ్రామస్తులు అదే ఒరవడిని ఇళ్లలోనూ కనబరిచారు. 300కు పైగా ఇళ్లలో ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్బజలాలు పెరిగాయి.
ఉపాధి హామీ పథకం ద్వారానే చొర్లంగిలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు. గ్రామ ప్రతిష్ట పెంచుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాలను కూడా నరేగా నిధులతోనే నిర్మించుకున్నారు. గ్రామంలోని అంతర్గత కాంక్రీట్ రహదారులకు మూలమూ నరేగా నిధులే. ఇక ఊరిలో మరో ప్రధాన సమస్య పారిశుధ్యం. అందుకే ఊరిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కొత్త ఉపాయం కనిపెట్టారు. గ్రామంలోని చెత్త ద్వారానే సంపద సృష్టించే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో అవసరమైన చోట్ల కల్వర్టులను కూడా నిర్మించుకున్నారు. ఉపాధి హామీ పథకం గ్రామంలోని మౌలిక వసతులను కల్పించింది. సాగును గాడిలో పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామ స్వరూపాన్నే మార్చివేసింది.
- అక్షర ప్రణవ్