కరోనా ప్రపంచాన్నంతా భయపెడుతున్నది. ప్రతి మనిషినీ వణికిస్తున్నది. కానీ, ఈ గ్రామాల్లో మాత్రం ఆ వైరస్ జాడ మచ్చుకైనా లేదు.
స్వచ్ఛంద సంస్థల కృషి, ప్రజల చైతన్యం, ప్రభుత్వ చేయూత.. మూడు వ్యవస్థలూ చేతులు కలిపితే, ఎన్ని అద్భుతాలైనా చేయవచ్చని నిరూపించే ఉదంతం ఇది. అగ్రదేశాలైన అమెరికా, చైనాలు సాధించలేని విజయం ఆ పల్లెలకు ఎలా సాధ్యమైంది? ఆక్స్ఫర్డ్లూ, స్టాన్ఫోర్డ్లూ దృష్టి సారించాల్సిన కోణాలివి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 70 కిలోమీటర్లు.చుట్టూ ఆకుపచ్చని కొండలు.ఆ కొండల మధ్య పాలపిట్టల్లా ఒదిగున్న ప్రాంతం..పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ఆళ్లపల్లి, మొలకలపల్లి, టేకులపల్లి మండలాలు. మొత్తం ముప్పై ఒక్క కుగ్రామాలు.నగరానికి దూరంగా ఉన్నారు కాబట్టి, అనాగరికులని అనుకుంటే పొరపాటు. గిరిజన గూడేలు కాబట్టి.. ఇరుకిరుకుగా, అపరిశుభ్రంగా ఉంటాయనుకుంటే మళ్లీ పొరపాటు. ఆ నివాస సముదాయాలు ఆధునికమైన కాలనీలను మరిపిస్తాయి. ఇంటికీ ఇంటికీ మధ్య నలభై అడుగుల దూరమైనా ఉంటుంది. నివాసం చుట్టూ వెదురు కర్రలతో దడిలు కట్టుకుంటారు. ఇంటి వెనుక వేప, ఇప్ప చెట్లు తప్పక ఉంటాయి. ముక్కులకు జిల్లేడు ఆకు మాస్కులు చుట్టుకొని.. పలుగూ పారలతో పోడు వ్యవసాయం చేస్తూనో, వాగుల్లోంచి నీళ్లు మోసుకొస్తూనో కనిపిస్తారు స్థానిక జనం.
ఆకుపచ్చని కొండల మధ్య పాలపిట్టల్లా ఒదిగున్న కుగ్రామాలకు వెళ్దాం రండి… https://youtu.be/0W57P-Uf78o