- IN DEPTH /Shyammohan
ఏప్రిల్ 28, 2018న విద్యుత్తు సరఫరాలేని మధ్య మణిపూర్లోని సేనాపతి జిల్లాలోని లాయ్సాంగ్ గ్రామానికి కరెంటు కనెక్షన్ ఇస్తూ ప్రధాని మోడీ దేశంలో విద్యుత్తు లేని ఊరు లేదు! అని ట్వీట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కొన సాగింపుగా, మరింత స్పష్టత ఇస్తూ, కేంద్రవిద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ ” దేశంలోని ఏడు రాష్ట్రాల్లో (వాటిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి) నూరు శాతం ఇళ్లకు విద్యుత్ ఇచ్చాం.మిగతా రాష్ట్రాలకు డిసెంబర్ 2018నాటికి ప్రతీ ఇంటికి కరెంట్ ఇస్తాం” అన్నారు.
ఈ నేపథ్యలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో, చీకట్లో మగ్గుతున్న కొన్ని పల్లెలు, అక్కడి ఇళ్లను రూరల్మీడియా మీకు చూపిస్తోంది… రండి.
‘చిరుతలు,ఏనుగుల మధ్య చీకట్లో బతుకుతున్నాం ‘
అసలు కరెంట్ తీగ ఎలా ఉంటుందో కూడా తెలియని గ్రామం మాధవరం కుయ్యవంక(తవణం పల్లి మండలం,చిత్తూరు జిల్లా). చుట్టూ అడవి, మధ్యలో చిన్న పూరిళ్లలో అడివి బర్రెల పాలు తాగుతూ, ఆకాశంలోని చుక్కల వెలుగులో బతికేస్తున్నారు. ఇక్కడ యానాది గిరిజన తెగకు చెందిన 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరికీ రేషన్,ఆధార్ ,ఓటర్ కార్డులున్నాయి. కానీ విద్యుత్ లేదు. కిరోసిన్ గుడ్డిదీపాలతో రాత్రులు గడుపుతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా, రేషన్ సరుకులు,కిరోసిన్ తెచ్చుకోవాలన్నా 3కిలో మీటర్ల దూరంలోని మాధవరం వెళ్లాలి.
” కరెంట్ బల్బ్ ఎలా ఉంటుందో ఇప్పటికీ మాకు తెలియదు. పిల్లలు హోం వర్క్ చేయడానికి వెలుగు లేదు. కనీసం బడికి వెళ్లాలన్నా రహదారి సరిగా లేక, ఆటో కూడా రావడం లేదు. దీనివల్ల ఇరవై మంది పిల్లలు డ్రాపౌట్స్గా మిగిలిపోయారు” అంటారు గ్రామస్ధులు. ఇక్కడి ప్రజలు పశువులు,గొర్రెలను మేపుకొంటు, చిన్న కమతాల్లో కూరగాయలు పండిస్తున్నారు. గొర్రెల పై దాడి చేయడానికి తరచూ అడవి జంతువులు వీరి ఇళ్ల మధ్యకు రావడంతో అదొక జీవన్మరణ సమస్యగా మారింది.
టెన్త్ వరకు చదివిన గంగులమ్మ ఈ గ్రామంలో చదువుకున్న ఏకైక వ్యక్తి.పొలం పనులు చేసుకుంటూ సాయంత్రం పిల్లలకు చదువు చెబుతుంది.
” కరెంట్ కోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తరచూ నక్కలు, ఏనుగులు మా గూడెం వైపు వస్తుంటాయి. సమీపంలో ఉన్న తుమ్మపాలెం అడవిలో చిరుత పులి సంచరిస్తుంది. వీటి నుండి కాపాడుకోవడానికి కట్టెలతో రాత్రుళ్లు మంటలు వేసుకొని కొందరు వంతుల వారీగా కాపలా కాయాల్సి వస్తోంది. సెల్ ఫోన్ ఛార్జింగ్కి కొండ దిగి 3 కిలో మీటర్లు దూరం పోవాలి. మాకు కనీసం వీధి లైట్లు వేసినా బాగుండేది.” అని మాతో ధీనంగా చెప్పింది గంగులమ్మ.
తర తరాలుగా చీకటి…
” విద్యుత్ లేక పోవడం వల్ల ఈ గ్రామం అభివృద్ధిచెందడం లేదు.పిల్లల చదువుకు దూరమవుతున్నారు. దోమల వల్ల వ్యాధులకు లోనవుతున్నారు. మాధవరం పంచాయితీకి కరెంట్ ఉన్నప్పటికీ దానిలో భాగమైన ఈ కుగ్రామానికి కరెంట్ లైన్ ఇవ్వడం లేదు. అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల అటవీశాఖ అనుమతి కావాలని విద్యుత్ శాఖ అంటోంది. తరతరాలుగా వీరు చీకట్లోనే మగ్గుతున్నారు. వారు సాగు చేసుకోవడానికి మా సంస్ధ తరపున పండ్ల మొక్కలు,కూరగాయల విత్తనాలు ఇచ్చాం. దాంతో జీవనోపాధిని పొందుతున్నారు. ” అంటున్నారు వీరి తరపున విద్యుత్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ కృషి చేస్తున్న మాస్ ఎన్జీఓ సంస్ధ డైరెక్టర్ సునంద.
తూరుపు కనుమల్లో చీకటి పల్లెలు
విశాఖ ఏజన్సీలో విసిరేసినట్టున్న గ్రామాలు గత్తుం, జంగం పుట్టు, గున్నమామిడి.ఇవన్నీ పాడేరు ఐటీడీఏ గ్రామాలు. అరకు వ్యాలీ నుండి పాడేరు వెళ్లే దారిలో ఈ గ్రామాలుంటాయి. ‘గత్తుం’ వరకు మాత్రమే రహదారి ఉంది.మిగిలిన గ్రామాలకు కాలిబాటలో అటవీ మార్గంలో 4 కిలో మీటర్లు నడిచి వెళ్లాలి. ఇక్కడి జనం కిరోసిన్ గుడ్డి దీపాల్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. గున్నమామిడిలో విద్యుత్ లేదు. మిగతా గ్రామాలకు కరెంట్ పోల్స్ వేసినా వారానికో సారి విద్యుత్ వస్తే గొప్ప అంటారు ప్రజలు. ఈ కొండ ప్రాంతంలో గాలులు విపరీతంగా వీయడం వల్ల కరెంట్ తీగెలు తెగి పడుతుంటాయి. లైన్ మేన్ కోసం కబురు చేయాలన్నా సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉండదు. సిగ్నల్స్ పనిచేయవు.
కనీసం సోలారు లైట్లయినా కావాలి.
,” కరెంట్ లేక పోవడం వల్ల చీకటి పడితే బయటకు రాలేం, పొలాలకు వెళ్లలేం.చుట్టూ కొండలు మధ్యలో మా గ్రామం. అడవి జంతువులు మా చుట్టూ తిరుగుతుంటాయి.వీటి నుండి కాపాడుకోవడానికి మాకు కనీసం సోలారు లైట్లయినా కావాలి. మూడేళ్ల క్రితం ఇంటికో సోలారు లైట్ను రామకష్ణమిషన్ వారు పంచారు. కానీ అవికూడా రిపేర్లు వచ్చి మూలన పడ్డాయి. ” అంటారు గత్తుం గ్రామస్దులు. ఇక్కడ ఒక అంగన్ వాడీ కేంద్రం ఉంది కానీ దానికీ కరెంట్ లేదు. ఇరవై మంది చిన్నారులు, కొందరు గర్బినీ స్త్రీలు రోజూ ఇక్కడికి వస్తారు.
సుమారు ఏడు వందల మంది ఈ మూడు గ్రామాల్లో జీవిస్తున్నారు.
అక్కడక్కడా కొన్ని విద్యుత్ పోల్స్ వేశారు. ఒక్క వీధి లైట్ కూడాలేదు. ఒక్కో పోల్ మధ్య దూరం 300 నుండి 400 మీటర్లు వరకు ఉంటుంది. దాని వల్ల గాలులకు తెగి పడుతుంటాయి. కొన్ని చోట్ల గ్రామస్ధులే అనధికారికంగా పోల్స్ వేసుకోవడం మా దృష్టికి వచ్చింది.
చీకట్లో 172 గ్రామాలు
” విజయ నగరం, విశాఖ,శ్రీకాకుళం జిల్లాల్లో రెండేళ్ల క్రితం విద్యుత్ లేని 172 గ్రామాలను గుర్తించి సోలారు లైట్లు ఇచ్చాం. కానీ అవి తాత్కాలికమే,వారికి విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తే గ్రామాలు మెరుగవుతాయి. ఆ గ్రామాలకు ఇప్పటికైనా కరెంట్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి త్వరలో క్షేత్ర పర్యటన చేయబోతున్నాం.” అని రామకృష్ణామిషన్ ఆశ్రమ కార్యదర్శి ఆత్మవిదానంద అన్నారు.
విద్యుత్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం
” కొన్ని గ్రామాలకు విద్యుత్ లేని మాట నిజమే. అవి కొండల మీద ఉండటం వల్ల వైర్లు వెళ్లవు. కొన్ని చోట్ల విద్యుత్ లైన్లు ఉన్నా కరెంట్ లేక పోవడానికి కారణం తరచూ విద్యుత్తీగలు చోరీకి గురవుతుంటాయి. గ్రామస్తులు పోలీసు కంప్లైంట్ ఇస్తేనే మేం ఆ సమస్యను పరిష్కరిస్తాం. కానీ గ్రామస్తులు ముందుకు రారు. ఈ ప్రాంతమంతా ఒరిస్సా సరిహద్దుల్లో ఉండటం వల్ల అక్కడి నుండి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు చిన్న ఆవాసాలుగా ఏర్పడతాయి. వారు స్ధిరంగా ఉండక తరచూ మారుతుంటారు. అలాంటి వారికి విద్యుత్ ఇవ్వడం కష్టం. అయినప్పటికీ ప్రతీ ఇంటికీ విద్యుత్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. పోల్స్ వేయడానికి వీలు కాని చోట సోలార్ విద్యుత్ ఇస్తున్నాం.’ అని పాడేరు ఏజెన్సీ విద్యుత్ శాఖ ఏఇ ప్రభాకర రావు, చెప్పారు. మా పరిశీలనలో తేలిన కొన్ని గ్రామాలు మాత్రమే ఇవి. నల్లమల అటవీ ప్రాంతంలో కరెంట్ లేని అనేక గిరిజన గ్రామాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
(This article is presented under RuralMedia-Nirmaan partnership,Contact- 9440595858)